Sunil Chhetri: రీఎంట్రీ అవసరమా?: ఫుట్‌బాల్‌ దిగ్గజం | "Not A Good Sign For Indian Football..": Bhaichung Bhutia Doesnt Hold Back As Sunil Chhetri Makes Retirement U Turn | Sakshi
Sakshi News home page

Sunil Chhetri: రీఎంట్రీ అవసరమా?: ఫుట్‌బాల్‌ దిగ్గజం

Mar 8 2025 7:53 AM | Updated on Mar 8 2025 9:30 AM

Not A Good Sign: Bhaichung Bhutia Doesnt Hold back as Sunil Chhetri U Turn

భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు సునీల్‌ ఛెత్రి(Sunil Chhetri) అనడంలో సందేహమే లేదు. జాతీయ జట్టు తరఫున 151 మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్‌ సాధించాడు. గత ఏడాది జూన్‌లో అతను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి తప్పుకున్నాడు. 

ఇప్పుడు అనూహ్యంగా ఛెత్రి పునరాగమనం చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం కావడం ఫుట్‌బాల్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

కోచ్‌ మనోలో మార్క్వెజ్‌ విజ్ఞప్తి మేరకు తిరిగి వచ్చాడని చెబుతున్నా... భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు తాజా పరిస్థితిని ఇది సూచిస్తోంది. అతను తిరిగి రావడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘జట్టు కోణంలో చూస్తే ఇది సరైన నిర్ణయమే. 40 ఏళ్లు దాటిన వ్యక్తిని మళ్లీ ఆడిస్తున్నారేంటి అని అడగవచ్చు. అయితే గతంలోనూ ఇలాంటివి జరిగాయి.

మంచి స్ట్రయికర్‌ను సిద్ధం చేసేందుకు భారత్‌ ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. ఐఎస్‌ఎల్‌లో బాగా ఆడుతున్న వారంతా విదేశీయులే. పైగా ఛెత్రి సూపర్‌ ఫిట్‌గా ఉన్నాడు’ అని మాజీ ఆటగాడు ఎం.విజయన్‌ అభిప్రాయపడ్డారు. ఆసియా కప్‌ 2027 కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల జట్టులో ఛెత్రికి అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) చోటు కల్పించింది. 

ప్రస్తుతం జరుగుతున్న ఐఎస్‌ఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఛెత్రి 12 గోల్స్‌తో టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. వయసుకంటే అతని ఆటను చూడాలని ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు కళ్యాణ్‌ చౌబే అన్నారు.

‘ఛెత్రి నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని స్థాయి ప్లేయర్‌ మొత్తం జట్టులో స్ఫూర్తిని నింపగలడు. అలాంటి స్ట్రయికర్‌ ఉంటే భారత జట్టుకు మేలు జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. ఛెత్రి రిటైర్మెంట్‌ తర్వాత నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 3 మ్యాచ్‌లు ‘డ్రా’ చేసుకొని మరో దాంట్లో చిత్తుగా ఓడింది తప్ప ఒక్క విజయమూ దక్కలేదు. 

రీఎంట్రీ అవసరమా?
అయితే ఛెత్రి పునరాగమనం భారత ఫుట్‌బాల్‌ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తోంది. అతడు తప్పుకున్న తర్వాత కూడా కనీసం ఒక నాణ్యమైన స్ట్రయికర్‌ను జట్టు తయారు చేసుకోలేకపోతోంది.

‘ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా సరే ఛెత్రి తప్పుకోవాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు. ఎప్పటి వరకు అతనిపై ఆధారపడతారు. ఏ ఆటలోనైనా, ఎంత గొప్పవారైనా ఆటను ముగించాల్సిందే. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడం, ప్రతిభను ప్రోత్సహించి ఫలితాలు రాబట్టడం ఫెడరేషన్‌ చేయాల్సిన పని. 

కానీ మళ్లీ వచ్చి ఆడమని అడగటం ఏ రకంగాను సరైంది కాదు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా... యువ ఆటగాళ్లను భవిష్యత్తు కోసం సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అని ఫుట్‌బాల్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ భాయ్‌చంగ్‌ భుటియా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. హెడ్‌కోచ్‌ మనోలో మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని తనకు తెలుసునని.. అయితే, ఛెత్రిని తిరిగి తీసుకురావడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలేమీ కలగవని పేర్కొన్నాడు. 

ఛెత్రి పునరాగమనం అద్భుతంగా అనిపిస్తున్నా.. భారత ఫుట్‌బాల్‌ అభివృద్ధికి ఇది ఏమాత్రం దోహదం చేయదని అభిప్రాయపడ్డాడు. నలభై ఏళ్ల ఆటగాడిపై ఆధారపడి జట్టును నడుపుతామని చెప్పడం సరైన సంకేతం కాదని భుటియా పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement