అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
కాగా అఫ్గాన్తో మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జూన్ 9న ముల్లాన్పూర్లో భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు తొడ కండరాల గాయం బారిన పడడంతో విరాట్ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్బాల్ సిరీస్కు కోహ్లి దూరం కావడం భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.
విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన విరాట్ను భారత జెర్సీలో చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు మళ్లీ జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగననున్నాడు.
మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. రోహిత్ కూడా ప్రస్తుతం తొడ కండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది.
ఫిట్నెస్ పరీక్షలలో అతడు పాసైతేనే జట్టులో కొనసాగనున్నాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో భర్తీ చేయనున్నారు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 13 న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.
అఫ్గానిస్తాన్తో వన్డేలకు భారత జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్, కుల్దీప్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, హార్దిక్ పాండ్యా
చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్


