
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే చర్చ. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నూ తాజాగా అడుగుపెట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG)తో శనివారం (ఏప్రిల్ 19) నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.
తొలి బంతినే సిక్సర్గా మలిచాడు
తద్వారా అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. రాయల్స్ ఓపెనర్గా తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు ఈ చిచ్చరపిడుగు. లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో బంతిని బలంగా బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు.
ఈ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమంటూ మాజీ క్రికెటర్లు వైభవ్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.
మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం..
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత కోచ్ మనీశ్ ఓజా ఈ టీనేజర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘తనకి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లాడు కదా.. సహజంగానే పిజ్జా అంటే కూడా మక్కువ ఎక్కువే. కానీ ఇకపై అతడు వాటిని తినబోడు.
ఇక్కడికి రాగానే మటన్తో పాటు పిజ్జా అతడి డైట్ చార్ట్ నుంచి ఎగిరిపోయింది. మేమైతే అతడికి తరచుగా మటన్ పెట్టేవాళ్లం. ఎంత పెట్టినా సరే అంతా తినేసేవాడు. అందుకే తను కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే, ఇప్పుడు తనకు ఇష్టమైన ఆహారాన్ని అతడు సంతోషంగానే వదులుకున్నాడు.
యువీ- యువీ కలిస్తే అతడు
వైభవ్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. అతడు ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూశారు కదా!.. భవిష్యత్ కాలంలో అతడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. తను ఫియర్లెస్ బ్యాటర్.
అతడికి బ్రియన్ లారా ఆరాధ్య క్రికెటర్. అయితే, లారా- యువరాజ్ సింగ్ కలిస్తే ఎలా ఉంటుందో.. వైభవ్ అలాంటి ఆటగాడు. యువీలా దూకుడుగా ఆడటం తన శైలి.
‘బంతి సిక్సర్ కొట్టేందుకు ఆస్కారం ఇస్తే నేనెందుకు సింగిల్ తీయాలి?.. సిక్సే కొడతా’ అని వైభవ్ చెబుతూ ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లో మేము 4 ఓవర్లలో 40 పరుగులు.. ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆటగాళ్ల మధ్య పోటీలు పెట్టేవాళ్లం.
వైభవ్ అయితే.. ఇంకొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసేవాడు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. లక్నోతో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాగా మెగా వేలం-2025లో రాజస్తాన్ 1.1 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ను కొనుగోలు చేసింది.
చదవండి: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025