మే నెల మొనగాడు.. ఈ బంగ్లా ఆటగాడు

Mushfiqur Rahim And Kathryn Bryce Voted ICC Players Of The Month For May 2021 - Sakshi

దుబాయ్: మే నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును బంగ్లాదేశ్‌ ఆటగాడు ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌ దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం పాకిస్తాన్‌కు చెందిన హసన్‌ అలీ, శ్రీలంకకు చెందిన ప్రవీణ్ జయవిక్రమ పోటీపడగా.. చివరకు ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌ను ఈ అవార్డు వరించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి బంగ్లా ఆటగాడిగా ముష్ఫిక‌ర్ రహీమ్‌ రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ అవార్డు రేసులో నిలిచిన పాక్ యువ​ బౌలర్​ హసన్ ​అలీ.. మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్​ప్రవీణ్‌ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. 

ఇక ముష్ఫికర్‌ రహీమ్‌.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును ఎగురేసుకుపోయాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్‌ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్‌ గెలిచింది. రహీమ్‌ ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ అకాడ‌మీ స‌భ్యుడు వీవీఎస్ ల‌క్ష్మణ్ మాట్లాడుతూ.. 15 ఏళ్లు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడిన తర్వాత కూడా ముష్ఫిక‌ర్ ర‌హీమ్ ప‌రుగుల దాహం తీర‌లేద‌ని వ్యాఖ్యానించాడు. మరోవైపు మహిళల క్రికెట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును స్కాట్లాండ్ ఆల్‌రౌండ‌ర్ కాథ‌రిన్ బ్రైస్‌ ద‌క్కించుకుంది. ఆమెకు గేబీ లూయిస్​(ఐర్లాండ్), లీ పాల్​(ఐర్లాండ్)ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.
చదవండి: WTC Final: ‘కోహ్లి క్రేజ్‌ అలాంటిది మరి.. జాన్‌ సీన మద్దతు భారత్‌కే’!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top