
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపై అతడు డొమాస్టిక్ క్రికెట్లో గోవా తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్కు లేఖ రాశాడు. అందుకు ఏంసీఎ కూడా అంగీకరించింది.
అయితే జైశ్వాల్ బాటలో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా గోవాకు మారేందుకు సిద్దంగా ఉన్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా చాలా మంది ముంబై ఆటగాళ్లకు గోవా తరపున ఆడాలని సూర్య సూచిస్తున్నాడన్న నిరాధరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజగా ఈ వార్తలపై ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. అవన్నీ రూమర్సే అని ఏంసీఎ కార్యదర్శి అభయ్ హడప్ కొట్టిపారేశారు.
"ముంబై ఆటగాళ్లు చాలా మందిని గోవా తరపున ఆడాలని సూర్యకుమార్ ప్రేరేపిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఈ విషయం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలుసు. అవన్నీ వట్టి రూమర్సే. ఎంసీఎ అధికారులు ఇప్పటికే సూర్యతో మాట్లాడారు. ఆ వార్తలని అవాస్తవమని ధృవీకరించారు. సూర్య కుమార్ యాదవ్ ముంబై తరపున ఆడేందుకు కట్టుబడి ఉన్నాడు.
అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాడు. కాబట్టి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయడం మానుకోవాలి" అని అభయ్ హడప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సూర్యకుమార్ తన జూనియర్ క్రికెట్ నుంచి ముంబై తరపున ఆడుతున్నాడు. అతడు 2010లో మూడు ఫార్మాట్లలో ముంబై సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు.
అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడల్లా ముంబై కోసం సూర్య ఆడుతూనే ఉన్నాడు. సూర్యకుమార్ రంజీ ట్రోఫీలో 77 మ్యాచ్లు ఆడి 44.93 సగటుతో 13 సెంచరీలతో 5392 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా సూర్య కొనసాగుతున్నాడు.