IPL 2022: ధావన్‌ కాదంట.. మయాంక్‌కే అవకాశం

Mayank Agarwal To Become Captian Punjab Kings Instead Shikar Dhawan - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ అని ఊహాగానాలు వస్తున్నప్పటికి.. మయాంక్‌ అగర్వాల్‌వైపే ఫ్రాంచైజీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వేలానికి ముందే మయాంక్‌ అగర్వాల్‌తో(రూ.12 కోట్లు) పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌(రూ. 4 కోట్లు)ను రిటైన్‌ చేసుకున్న ఫ్రాంచైజీ మిగతా జట్టును మొత్తం రిలీజ్‌ చేసింది. గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌ ఈసారి వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో కొత్త కెప్టెన్‌ ఎవరనే దానిపై చర్చ నడిచింది.

ఇటీవలే ముగిసిన మెగావేలంలో శిఖర్‌ ధావన్‌ను రూ. 9.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ధావన్‌తో పాటు కగిసో రబాడ, జానీ బెయిర్‌ స్టో, రాహుల్‌ చహర్‌, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, షారుక్‌ ఖాన్‌ లాంటి పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ పేరు తప్ప మరో ఆటగాడు కనిపించలేదు. అయితే రిటైన్‌ చేసుకున్న మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు ధావన్‌కు అప్పగిస్తే ఎలా ఉంటుందనే యోచన చేసింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో మయాంక్‌కు కెప్టెన్సీ కట్టబెట్టనున్నారు. ఈ విషయాన్ని ఈ వారాంతంలోనే ప్రకటించే అవకాశం ఉంది. 

ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌లో 2014లో ఫైనల్‌ మినహా మళ్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది లేదు. గత మూడు సీజన్ల నుంచి చూసుకుంటే పంజాబ్‌ కింగ్స్‌ ఆరో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కాగా ఈసారి సీజన్‌ను మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ తొలి వారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. 

చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది?

IND W- NZ W: హమ్మయ్య.. మొత్తానికి గెలిచింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top