ఫైనల్లో మేరీ కోమ్‌

Mary Kom, Saskhi enter final of Asian Championships - Sakshi

 ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 

దుబాయ్‌: ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీ కోమ్‌ 4–1తో లుస్తాయ్‌ఖాన్‌ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్‌ సీడ్‌ దినా జోలామన్‌ (కజకిస్తాన్‌)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు.

మరో భారత బాక్సర్‌ లాల్‌ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది.  అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్‌ (57 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్‌ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్‌ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్‌) చేతిలో, జాస్మిన్‌ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్‌) చేతిలో, సిమ్రన్‌జిత్‌ 0–5తో వోలోస్సెన్‌ (కజకిస్తాన్‌) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్‌బఖోర్‌ ఖామ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top