Photo Credit: BCCI Twitter
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే చివరి రోజు ఆటలో నాలుగు వికెట్లు కూల్చడంలో విఫలమైన భారత్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో సైంధవుడిలా మారి భారత విజయాన్ని ఒంటిచేత్తో అడ్డుకున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్న వేళ మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొలంబో టెస్టులో విరాట్ కోహ్లి ఆడి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని, ఆ సైంధవుడి (సోనల్ దినూష) ఆటలు సాగేవి కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"టెస్టు క్రికెట్ ఆడడం అంత సులువు కాదు. లాంగ్ ఫార్మాట్ గేమ్గా పిలువబడే ఆటలో ఓపిక, సహనం చాలా అవసరం. అలసిపోయినా గంటల కొద్ది ఓవర్లు బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ మ్యాచ్లో కోహ్లి ఆడి ఉంటే ప్రతీసారి జట్టును ఎంకరేజ్ చేస్తూ గెలుపుకోసం పోరాడుదామని ప్రేరణనిస్తూ జట్టులో స్ఫూర్తిని నింపేవాడేమో.
కోహ్లి ఆడి ఉంటే సోనల్ దినూషను ఎక్కువగా టార్గెట్ చేస్తూ అతడిని ఔట్ చేసేందుకు పదేపదే బౌలర్లను మారుస్తూ ఫలితం రాబట్టేవాడు. కోహ్లి ఉంటే ప్రత్యర్థిని తన వ్యూహాలతో బోల్తా కొట్టించి వాళ్లను ఒత్తిడిలోని నెట్టేసేవాడు. లాంగ్ఫార్మాట్ అయిన టెస్టుల్లో కొన్నిసార్లు మనం బౌలింగ్ చేస్తూనే పోతాం.. బంతి బాగా టర్న్ అయ్యి వికెట్పడుతుందిలే అనుకొని పొరపాటు పడతాం. కొలంబో టెస్టులో ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఫలితం ఇలా వచ్చిందేమో." అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఇక 2025 మేలో విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్కు మాత్రమే పరిమితమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం కోహ్లి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశముంది. 123 టెస్టులాడిన కోహ్లి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి.


