
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ ఆటగాడు పీటర్ మూర్ ఒకరు. మూర్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐర్లాండ్ తరఫున వరల్డ్కప్ ఆడాలన్న కలతో ఆ దేశానికి వలస వెళ్లిన మూర్.. ఆ కోరిక తీరకుండానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
ఐర్లాండ్కు ఆడకముందు మూర్ జింబాబ్వే జట్టులో సభ్యుడు. మూర్ 2014లో బంగ్లాదేశ్తో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేశాడు. నాటి నుంచి మూర్ జింబాబ్వే ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మారాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ వికెట్కీపర్ అయిన మూర్ జింబాబ్వే తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్ట్లు ఆడాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1700 పైచిలుకు పరుగులు సాధించాడు.
అనంతరం మూర్ ఐరిష్ మూలాలు (నాన్నమ్మ) ఉండటంతో ఐర్లాండ్కు వలస వెళ్లాడు. 2023 మూర్ ఐర్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి ఆ దేశం తరఫున 7 టెస్ట్లు ఆడాడు. ఐర్లాండ్ తరఫున 2024 జులైలో అతని అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. నాడు మూర్ తన జన్మదేశమైన జింబాబ్వేపై మూర్ 79 పరుగులు చేశాడు.
అతను చివరిగా అంతర్జాతయ మ్యాచ్ ఆడింది కూడా జింబాబ్వేపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూర్ జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 4, 30 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్లో మూర్ తన చివరి మ్యాచ్ను నిన్ననే (జులై 10) ఆడాడు.
ఐరిష్ దేశవాలీ టోర్నీలో మన్స్టర్ రెడ్స్కు ప్రాతినిథ్యం వహించిన మూర్.. వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అతని జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇదే మ్యాచ్లో మూర్ సహచరుడు కర్టిస్ క్యాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మూర్ తన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికినా దేశవాలీ, టీ20 లీగ్ల్లో కొనసాగుతునాని చెప్పాడు.