ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా విండీస్ సెమీస్ అవకాశాలపై ఐర్లాండ్ నీళ్లు చల్లింది. ఇక విండీస్ జట్టు సెమీస్ భవితవ్యం ఇంగ్లండ్పై ఆధారపడి ఉంది.
విండీస్ సెమీస్ చేరాలంటే మరో మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం వెస్టిండీస్ మహిళల జట్టు ఇంటిబాట పట్టనుంది. అంతకముందు శుక్రవారం టీమిండియాను ఐర్లాండ్ పురుషుల జట్టు ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్లో ఐర్లాండ్ జట్టుకు 21 వరుస పరాజయాల తర్వాత ఇదే తొలి విజయం కావడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ కుదేలయ్యింది. చినెల్లె హెన్రీ (27) టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (22), డియాండ్రా దొతిన్ (21) పర్వాలేదనిపించింది. ఐర్లాండ్ బౌలర్లలో కారా ముర్రే, అమీ మగూరీ చెరో 2 వికెట్లు తీయగా, ఓర్లా, అర్లెన్ కెల్లీ, జేన్ మాగూరీ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 129 పరుగుల టార్గెట్ను ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఓర్లా ప్రెండెగస్ట్ (63) అర్ధసెంచరీ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించగా, ఓపెనర్ అమీ హంటర్ (28) రాణించింది. విండీస్ బౌలర్లలో ఆశ్మిని మునిసర్ 2 వికెట్లు తీసింది. విండీస్పై విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్లో 21 వరుస పరాజయాలకు ఐర్లాండ్ (2014-2026 వరకు) చెక్ పెట్టినట్లయింది. గతంలో బంగ్లాదేశ్ (2016-2023 వరకు) 16 వరుస పరాజయాలు మూటగట్టుకుంది.
చదవండి: చితక్కొట్టిన ఓపెనర్లు.. రంగారెడ్డి రైజర్స్ ఘనవిజయం


