ఐపీఎల్ 2026 వేలంలో అన్సోల్డ్గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కనకవర్షం కురిసింది. పీఎస్ఎల్లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్పాట్ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఉన్నారు.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోక, పీఎస్ఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..
డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు ఐపీఎల్ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్ఎల్లో మాత్రం మిచెల్పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.
ఆడమ్ జంపా: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ఐపీఎల్ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.
రిలీ రొస్సో: ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్ సోల్డ్గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.
పీఎస్ఎల్-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..
మార్క్ చాప్మన్- 7 కోట్లు (పాక్ కరెన్సీలో)
ఆస్టన్ టర్నర్- 4.2 కోట్లు
మైఖేల్ బ్రేస్వెల్- 4.2 కోట్లు
కుసాల్ మెండిస్- 4.2 కోట్లు
టామ్ కర్రన్- 4.2 కోట్లు
కుసాల్ పెరీరా- 3.1 కోట్లు
జేమ్స్ విన్స్- 3 కోట్లు
రిషద్ హొసేన్- 3 కోట్లు
వీరితో పాటు పీటర్ సిడిల్, జోష్ ఫిలిప్, తబ్రేస్ షంషి, జాన్సన్ ఛార్లెస్, మ్యాక్స్ బ్రయాంట్, షమార్ జోసఫ్, ఓట్నీల్ బార్ట్మన్, గుడకేశ్ మోటీ, రిచర్డ్ గ్లీసన్, బెన్ మెక్డెర్మాట్, దసున్ షనక, సామ్ హార్పర్, బెవాన్ జాకబ్స్ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్ఎల్ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.
పీఎస్ఎల్లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్ అల్ హసన్, కైల్ మేయర్స్, కొలిన్ మున్రో, అల్జరీ జోసఫ్, జేమ్స్ నీషమ్, జేసన్ రాయ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, డేవిడ్ మలాన్, కేశవ్ మహారాజ్ తదితరులు ఉన్నారు.


