
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో సీఎస్కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ.. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఆ జట్టు తదుపరి ఆడబోయే ఐదు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాలి. అయినా సీఎస్కే భవితవ్యం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ సీజన్లో సీఎస్కే దుస్థితికి జట్టు ఎంపికే ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. మెగా వేలంలో సీఎస్కే యాజమాన్యం రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఔట్ డేటెడ్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని మూల్యం చెల్లించుకుంది. జట్టులో ఒక్క విధ్వంసకర బ్యాటర్ ఉండేలా కూడా జాగ్రత్త పడలేదు. బౌలింగ్ విభాగంలో పర్వాలేదనినపిస్తున్నా ప్రతి మ్యాచ్లో వారిని నుంచే ఆశించడం అత్యాశ అవుతుంది.
ఈ సీజన్లో సీఎస్కే పేలవ ప్రదర్శనల నేపథ్యంలో ఆ జట్టు తాతాల్కిక సారధి ఎంఎస్ ధోని భవితవ్యంపై కూడా మరోసారి చర్చ మొదలైంది. ధోని కాస్తో కూస్తో ఫామ్లో ఉన్నప్పుడే హుందాగా తప్పుకుని ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వయసు మీద పడటంతో ధోని తన పాత్రకు అస్సలు న్యాయం చేయలేకపోతున్నాడని విశ్లేషకులు వాదిస్తున్నారు.
ఐపీఎల్లో సీఎస్కే మరియు ధోని భవితవ్యంపై చిన్న తలా సురేశ్ రైనా స్పందించాడు. జతిన్ సప్రుతో చాట్లో మాట్లాడుతూ.. ధోని కనీసం ఇంకో సీజన్ ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. సీఎస్కే వచ్చే సీజన్లో మెరుగైన ప్రణాళికతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ధోని తన బ్రాండ్ మరియు అభిమానుల కోసమే క్రికెట్ ఆడుతున్నాడని అన్నాడు. 43 ఏళ్ల వయసులోనూ బ్యాటింగ్, వికెట్ కీపింగ్తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా మోస్తూ సీఎస్కే కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నాడని తెలిపాడు. ధోని ఒక్కడే అన్ని బాధ్యతలను మోస్తుంటే మిగతా పది మంది ఆటగాళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.
జట్టు ఎంపికలో ధోనిదే తది నిర్ణయం అన్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. పలానా ఆటగాడితో కొనసాగాలా వద్దా అన్న దానిపై మాత్రం ధోనికి కాల్ రావచ్చని తెలిపాడు. తనకు తెలిసి జట్టు ఎంపిక ప్రక్రియలో ధోని ఎప్పుడూ పాల్గొనలేదని స్పష్టం చేశాడు. ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని సీఎస్కే కోర్ గ్రూప్ పర్యవేక్షిస్తుందని తెలిపాడు. ఒకవేళ కోర్ గ్రూప్ ధోనిని తన అభిప్రాయాన్ని వెల్లడించమని అడిగినా అతను నలుగురైదుగురు ఆటగాళ్ల పేర్లను సూచించి ఉండవచ్చని తెలిపాడు.