IPL 2025 Final: క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త | IPL 2025 Final, RCB vs PBKS: Rain Start In Ahmedabad | Sakshi
Sakshi News home page

IPL 2025 Final: క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త

Jun 3 2025 5:34 PM | Updated on Jun 3 2025 6:31 PM

IPL 2025 Final, RCB vs PBKS: Rain Start In Ahmedabad

Photo Courtesy: BCCI

క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త. ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. ఇవాళ (జూన్ 3) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వర్షం మొదలుకావడంతో క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదే వేదికపై జూన్‌ 1న జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ వర్షం కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. అయితే ఆ మ్యాచ్‌ ఎలాంటి ఓవర్ల కోత లేకుండా సాగింది. నేటి మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి పునరావృతమౌతుందేమోనని ఫ్యాన్స్‌ ఆందోళన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంలోకి రావడం మొదలుపెట్టారు. 

మ్యాచ్‌ ప్రారంభానికి ఇంకా రెండు గంటలకు పైగా సమయం ఉండటంతో ఆలోపు వర్షం​ తగ్గుతుందని ఫ్యాన్స్‌ అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షం​ మరీ అంత భారీగా కురువడం లేదు. ఒకవేళ ఇప్పుడు భారీ వర్షం​ పడినా నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజ్‌ వ్యవస్థ ఉంది కాబట్టి గ్రౌండ్‌ త్వరలోనే క్లియర్‌ అవుతుంది. హీన పక్షంలో ఇవాళ మ్యాచ్‌ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్‌ డే ఉంది. రేపైనా విజేత ఎవరో తేలిపోతుంది. 

రేపు కూడా వర్షం పడితే మాత్రం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ కంటే మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్‌ విజేతగా నిలుస్తుంది. అయితే పరిస్థితి ఇంత వరకు రాకపోవచ్చు. మ్యాచ్‌ వర్షాటంకం లేకుండా సాగాలని ఫ్యాన్స్‌ దేవుళ్లని ప్రార్దిస్తున్నారు.

వర్షం​ విషయం అటుంచితే, ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్‌ రావడం​ ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్‌ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్‌ ఓసారి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్‌ వరకు చేరాయి. 

లీగ్‌ దశలో పంజాబ్‌, ఆర్సీబీ సమంగా మ్యాచ్‌లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్‌ గెలిచాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై ఆర్సీబీ పైచేయి సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement