‘వారిద్దరూ ఔటైతే ఇక మిగతా జట్టంతా ఐసీయూనే’

IPL 2021:The Rajasthan Are In An ICU Once Buttler And Samson Get Out, Aakash Chopra - Sakshi

ముంబై:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘోర పరాజయం చెందడంతో మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం​ కురిపిస్తున్నారు. జాస్‌ బట్లర్‌ ధాటిగా ఆడుతున్నంతసేపు రాజస్థాన్‌ విజయం సాధించే అవకాశాలు ఉండగా తర్వాత పరిస్థితి మొదటకొచ్చింది. సంజూ సామ్సన్‌ సైతం విఫలం కావడంతో రాజస్థాన్‌ తిరిగి తేరుకోలేకపోయింది. అదే విషయాన్ని ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా విమర్శలు చేశాడు. తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడుతూ రాజస్థాన్‌ జట్టుపై ధ్వజమెత్తాడు. ఛేజింగ్‌కు ఎంతో అనుకూలమైన వాంఖడే స్టేడియంలో రాజస్థాన్‌ జట్టు క్యూకట్టడాన్ని తూర్పారబట్టాడు. 

‘బట్లర్‌ ఉండగా రాజస్థాన్‌ గెలుపు ఆశలు ఉన్నాయి. అందులోనూ వాంఖడే ఛేజింగ్‌ అనుకూలమనేది గత మ్యాచ్‌లో నిరూపితమైంది. కానీ దాన్ని రాజస్థాన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. రాజస్థాన్‌ జట్టును చూస్తే ఇద్దరిపైనే ఆధారపడుతున్నట్లు ఉంది. అది బట్లర్‌, సామ్సన్‌లు. ఒక్కసారి వారిద్దరూ ఔటై పెవిలియన్‌కు చేరితే మిగతా వారి ఐసీయూలోకి వెళ్లిపోతున్నారు. బట్లర్‌, సామ్సన్‌లు ఆడుతున్నంతసేపే ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. వారిద్దర్నీ ఔట్‌  చేస్తే రాజస్థాన్‌ కథ ముగిసిపోయినట్లే. ప్రస్తుతం రాజస్థాన్‌ జట్టు ఇలా ఉండటం నిజంగా బాధాకరం’ అని పేర్కొన్నాడు. 

రాజస్థాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో  49 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వోహ్రా తొలి వికెట్‌గా ఔటైన బట్లర్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. కాగా, సామ్సన్‌ పరుగు తీసి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ వరుస పెట్టి క్యూకట్టేసింది. చెన్నై స్పిన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోలేక 143 పరుగులకే చాపచుట్టేసి 45 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

ఇక్కడ చదవండి: ఓడిపోయినా సెలబ్రేట్‌ చేసుకున్నారు.. అదేంటో
బౌలర్‌ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్‌ దాటితే మాత్రం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top