అదానీతో గుకేశ్‌ భేటీ | Industrialist Gautam Adani meets with Dommaraju Gukesh | Sakshi
Sakshi News home page

అదానీతో గుకేశ్‌ భేటీ

Jan 3 2025 3:54 AM | Updated on Jan 3 2025 3:54 AM

Industrialist Gautam Adani meets with Dommaraju Gukesh

న్యూఢిల్లీ: టీనేజ్‌లోనే ప్రపంచ క్లాసికల్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో భేటీ అయ్యాడు. తల్లిదండ్రులు పద్మావతి, డాక్టర్‌ రజనీకాంత్‌లతో కలిసి గుకేశ్‌ అహ్మదాబాద్‌లో అదానీని కలిశాడు. ‘ప్రపంచ చెస్‌ చాంపియన్‌ను ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతని విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి వారితో నాకు ఈ భేటీ చాలా ప్రత్యేకమైంది. 

18 ఏళ్ల భారత కుర్రాడు ప్రపంచ చెస్‌లో సత్తా చాటుకున్నాడు. మన యువతరానికి ప్రేరణగా నిలిచాడు. దశాబ్దాలపాటు చెస్‌లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు గట్టి పునాది వేశాడు. అతని ఆత్మవిశ్వాసం, విజయం అద్భుతం. జై హింద్‌’ అని ‘ఎక్స్‌’లో గౌతమ్‌ అదానీ పోస్ట్‌ చేశారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌లో గుకేశ్‌... చైనాకు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు. అప్పుడు సోషల్‌ మీడియా వేదికగా గుకేశ్‌ను అదానీ ప్రశంసించారు. 

అదానీకి చెందిన స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ భారత గ్రాండ్‌మాస్టర్స్‌ ప్రజ్ఞానంద, అతని సోదరి వైశాలిలను స్పాన్సర్‌ చేస్తోంది. 1985లో 22 ఏళ్ల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన గ్యారీ కాస్పరోవ్‌ రికార్డును తాజాగా గుకేశ్‌ చెరిపేశాడు. చెస్‌ ఒలింపియాడ్‌లోనూ భారత్‌ స్వర్ణం గెలిచేందుకు కీలకపాత్ర పోషించిన అతని ప్రదర్శనను గుర్తించిన భారత ప్రభుత్వం  ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement