చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు | Indian Women's Blind Cricket Team Creates History, Enters Maiden Finals Of IBSA World Games - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు

Published Thu, Aug 24 2023 9:32 PM

Indian womens Blind Cricket Team Creates History, Enters Maiden Finals Of IBSA World Games - Sakshi

భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్‌ రికార్డుపుటల్లోకెక్కింది.  

బర్మింగ్‌హామ్‌ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, తుదిపోరుకు అర్హత సాధించింది. 

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ గేమ్స్‌లో తమ ప్రస్తానాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 59/6కి కట్టడి, అనంతరం సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హెచ్‌ గంగవ్వ  60 బంతుల్లో 117 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 268/2 స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 185 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

నిన్న (ఆగస్ట్‌ 23) జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 163 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, వరల్డ్ గేమ్స్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరుగబోయే టైటిల్‌ పోరుకు ముందు భారత్ ఇంగ్లండ్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్‌ (గురువారం) ఆడనుంది. ఫైనల్స్‌లో భారత ప్రత్యర్ధి ఖరారు కావల్సి ఉంది.

మరోవైపు ఇదే ఈవెంట్‌ పురుషుల విభాగంలోనూ భారత్‌ సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం టీమిండియా ఈ మ్యాచ్‌ ఆడనుంది. సెమీ ఫైనల్లో భారత్ గెలిస్తే, ఫైనల్స్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది.

Advertisement
Advertisement