ఏకైక టెస్టులో భారత మహిళల ఘన విజయం
270 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టుల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సోమవారం ముగిసిన ఏకైక టెస్టులో భారత్ 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ మహిళలను చిత్తుగా ఓడించింది. ఈ పోరులో ఆదివారమే భారత్ గెలుపు దాదాపు ఖాయం కాగా... మ్యాచ్ చివరిరోజు లాంఛనం పూర్తయింది.
457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 130/6తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 62.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. 22.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ మరో 56 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ మొదలైన మూడో ఓవర్లోనేఏ ఎమీ జోన్స్ (80 బంతుల్లో 54; 6 ఫోర్లు) అవుట్ కాగా... సోఫీ ఎకెల్స్టోన్ (66 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది.
భారత బౌలర్లలో ఆఫ్స్పిన్నర్ స్నేహ్ రాణాకు 4 వికెట్లు దక్కగా... సయాలీ సత్గరే, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా 2 వికెట్లు తీశారు. మొత్తం 91 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన క్రాంతి గౌడ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్ గడ్డపై టి20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శనతో సెమీస్ చేరడంలో విఫలమైన హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఇప్పుడు టెస్టులో ఘన విజయంతో సంతృప్తిగా పర్యటనను ముగించింది.
మరోవైపు సుదీర్ఘ కాలం ఇంగ్లండ్ మహిళల క్రికెట్కు చుక్కానిలా నిలిచిన ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ట్యామీ బ్యూమాంట్, హీతర్ నైట్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్టుల్లో పరుగులపరంగా భారత్కు ఇది రెండో అతి పెద్ద విజయం. 2023లో ముంబై వేదికగా ఇంగ్లండ్పైనే భారత్ 347 పరుగులతో గెలిచింది. ఇంగ్లండ్ గడ్డపై భారత్కిది మూడో విజయం. ఇరు జట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా 10 టెస్టులు జరిగాయి. మూడింటిలో భారత్ గెలిచి, ఏడింటిని ‘డ్రా’గా ముగించి అజేయంగా కొనసాగుతోంది.


