
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో చివరిరోజు భారత అథెట్లు ఏకంగా అరడజను స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో ఒలింపియన్ అన్ను రాణి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో విత్యా రామ్రాజ్... మహిళల 800 మీటర్ల విభాగంలో పూజ... పురుషుల 800 మీటర్ల విభాగంలో కృషన్ కుమార్... పురుషుల జావెలిన్ త్రోలో రోహత్ యాదవ్ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.
పురుషుల 4–400 మీటర్ల రిలేలో సంతోష్, విశాల్, మనూ, ధరమ్వీర్లతో కూడిన భారత బృందం (3ని:05.58 సెకన్లు) బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అన్ను రాణి జావెలిన్ను 56.82 మీటర్ల దూరం... రోహిత్ యాదవ్ 74.42 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచారు. విత్యా 400 మీటర్ల దూరాన్ని 56.53 సెకన్లలో పూర్తి చేసింది.
పూజ 800 మీటర్లను 2ని:02.79 సెకన్లలో... కృషన్ కుమార్ 800 మీటర్ల దూరాన్ని 1ని:48.46 సెకన్లలో పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో యశస్ పలాక్ష (42.22 సెకన్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో భారత క్రీడాకారిణులు శైలీ సింగ్ (6.41 మీటర్లు) రజతం, అన్సీ సోజన్ (6.39 మీటర్లు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.