Ind VS Eng 2nd Test Day 4:  ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న రహానే, పుజారా

India Vs England 2nd Test Day4 Updates And Highlights - Sakshi

ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న రహానే, పుజారా
► టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. అజింక్యా రహానే 126 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టాపార్డర్‌ విఫలమైన వేళ రహానే, పుజారాలు నెమ్మదైన ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.  ప్రస్తుతం టీమిండియా 69 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. పుజారా (38, 192 బంతులు), రహానే( 50, 126 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 80 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇక టీమిండియా 108 పరుగుల ఆధిక్యంలో ఉంది.

76 పరుగుల ఆధిక్యంలో భారత్‌
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో  నిలకడగా ఆడుతోంది. టాపార్డర్‌ విఫలమైన వేళ పుజరా, రహానేలు సమయోచితంగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు.  మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసిన టీమిండియా ఇప్పటివరకు 76 పరుగుల ఆధిక్యం సాధించింది. పుజారా 29, రహానే 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

► లంచ్‌ విరామం అనంతరం టీమిండియా జాగ్రత్తగా ఆడుతోంది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసిన టీమిండియా 37 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారా 8, రహానే 8 పరుగుతో క్రీజులో ఉన్నారు. నెమ్మదిగా ఆడుతున్న పుజారా 8 పరుగులు చేయడానికి 78 బంతులు తీసుకోవడం విశేషం.

లంచ్‌ విరామం.. 29 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
► ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్‌ విరామం సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. తద్వారా 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్‌, రాహుల్‌లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి 20 పరుగులు చేసి సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా మరో రెండు సెషన్ల పాటు నిలబడి ఎన్ని పరుగులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పుజారా 3, రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

రోహిత్‌ శర్మ ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
► రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతుంది. 21 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌ మార్క్‌వుడ్‌ వేసిన షార్ట్‌బాల్‌ను అంచనా వేయడంలో పొరబడి బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 2 వికెట్ల నష్టానికి 27 పరుగులతో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని చేరుకుంది. క్రీజులో కోహ్లి(0), పుజారా(0)లు ఉన్నారు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. రోహిత్‌ 15, పుజారా 0 క్రీజులో ఉన్నారు.

లార్డ్స్‌: ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటకు చేరుకుంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక నాలుగో రోజు ఆటలో భారత్‌ ఎంత వేగంగా ఆడుతుందనే దానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చే క్రమంలో వారి బౌలింగ్‌ను ఎదుర్కొంటారా లేక చతికిలపడతారా అనేది చూడాలి.

అంతకముందు మూడోరోజు ఆటలో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 180 నాటౌట్‌; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్‌ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది. కాగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top