జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.
ఇక 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్ను తప్పించి వైభవ్కు అవకాశమిచ్చారు.
ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్కు సంజూ శాంసన్ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్రేట్తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్సిమ్రన్ (వికెట్ కీపర్).
జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:
తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)
రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)
మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)


