భారత మహిళల అసమాన పోరాటం

India hold on to draw womens Test match against England - Sakshi

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ‘డ్రా’

రెండో ఇన్నింగ్స్‌లో 344/8

స్నేహ్‌ రాణా అజేయ అర్ధ సెంచరీ

రాణించిన దీప్తి, తానియా  

బ్రిస్టల్‌: ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో స్నేహ్‌ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్‌; 13 ఫోర్లు), శిఖా పాండే (50 బంతుల్లో 18; 3 ఫోర్లు), తానియా భాటియా (88 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఇంగ్లండ్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న స్నేహ్, తానియా అజేయంగా తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం.

ఫలితంగా ఓవర్‌నైట్‌ స్కోరు 83/1తో మ్యాచ్‌ చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 121 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు చేసింది. టీ విరామానికి భారత్‌ 8 వికెట్లకు 243 పరుగులతో కష్టాల్లో ఉంది. అయితే చివరి సెషన్‌ అంతా స్నేహ్, తానియా వికెట్‌ చేజార్చుకోకుండా ఆడటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. అంతకుముందు షఫాలీ వర్మ (83 బంతుల్లో 63; 11 ఫోర్లు, సిక్స్‌), దీప్తి శర్మ (168 బంతుల్లో 54; 8 ఫోర్లు), పూనమ్‌ రౌత్‌ (104 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (4), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (8) మాత్రం మళ్లీ నిరాశపరిచారు. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈనెల 27న మొదలవుతుంది.  

సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 396/9 డిక్లేర్డ్‌; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 231 ఆలౌట్‌;  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 344/8 (121 ఓవర్లలో).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top