భారీ స్కోర్‌ దిశగా టీమిండియా | IND-A VS SL-A 1st Test: India 333 for 4 at Day 1 Stumps | Sakshi
Sakshi News home page

భారీ స్కోర్‌ దిశగా టీమిండియా

Jun 25 2026 6:06 PM | Updated on Jun 25 2026 7:02 PM

IND-A VS SL-A 1st Test: India 333 for 4 at Day 1 Stumps

భారత్‌-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ ఇవాల్టి నుంచి (జూన్‌ 25) ప్రారంభమైంది. గాలే వేదికగా మొదలైన తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (132) సెంచరీతో.. మిడిలార్డర్‌ బ్యాటర్లు ధృవ్‌ జురెల్‌ (68 నాటౌట్‌), షేక్‌ రషీద్‌ (53 నాటౌట్‌) అర్ద శతకాలతో సత్తా చాటడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు (86 ఓవర్లు) చేసింది.

స్టార్‌ బ్యాటర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (22), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (12) నిరాశపరిచినా భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగడం విశేషం. ఇవాళ ఔటైన మరో భారత బ్యాటర్‌ ఆయుశ్‌ పాండే. అతడు 25 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.లంక బౌలర్లలో దిలుమ్‌ సుదీర 2 వికెట్లు తీయగా.. చమిక గుణశేఖర, రవిందు ఫెర్నాంతో తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు భారత-ఏ జట్టు లంకలోనే ట్రై నేషన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌ సహా) వన్డే సిరీస్‌ ఆడింది. ఈ టోర్నీలో భారత్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య లంక జట్టును చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి (29 బంతుల్లో 94 పరుగులు) భారత్‌కు టైటిల్‌ అందించాడు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement