IND vs SL: దుమ్ము రేపిన రోహిత్‌ శర్మ.. అయ్యో! సెంచరీ మిస్‌

IND vs SL: Fans react as Rohit Sharma smashes 83 runs just 67 balls - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో రోహిత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. కాగా ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

83 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ శ్రీలంక పేసర్‌ మధుశంక బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఓ దశలో 150(డాడీ 100)కి పైగా పరుగులు చేస్తాడని భావించగా.. రోహిత్‌ ఇలా సెంచరీ చేజార్చుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా.. ‘‘హృదయం ముక్కలైంది’’ అంటూ బ్రేకింగ్‌ హార్ట్‌ ఎమోజీలు జతచేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం.. ‘‘రోహిత్‌ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.. కానీ.. డాడీ 100 మిస్‌ అయ్యాడు’’ అని విచారం వ్యక్తం చేశాడు.

భారీ స్కోర్‌ దిశగా భారత్‌
ఇక లంకతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 41 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్‌ కోహ్లి(62), హార్దిక్‌ పాండ్యా(0) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు తొలి వికెట్‌కు రోహిత్‌, గిల్‌ కలిసి 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో గిల్‌ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top