
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలు
ఇంగ్లండ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన తుదిజట్టు (భారత్)ను ప్రకటించాడు. కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్లను ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు లీడ్స్ వేదిక. ఈ మ్యాచ్తో శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.
అశూ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ లీడ్స్ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్తో పాటు కరుణ్ నాయర్కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.
‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ను అశూ వెల్లడించాడు.
అందుకే కరుణ్కే ఓటు
అయితే, ఆరో స్థానం కోసం కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్ దృష్ట్యా కరుణ్కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్ ఆప్షన్ కోసం శార్దూల్ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
అత్యధిక వికెట్లు తీసేది అతడే!
అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లిష్ పేసర్ క్రిస్ వోక్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్ బషీర్ హయ్యస్ట్ వికెట్ టేకర్ అవుతాడని పేర్కొన్నాడు.
టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.
పరుగుల వీరుడిగా పంత్!
ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్ పంత్ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్కు పటౌడీ మెడల్ అందిస్తారు.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు అశ్విన్ ఎంపిక చేసిన భారత తుదిజట్టు
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన తుదిజట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.