
England vs India, 3rd Test- Lord's Day 1: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. పిచ్ స్వభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. తాను టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. తమ బౌలర్లు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నాడు.
మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం తనకు సంతోషంగా ఉందన్న గిల్.. తాము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్లో తొలి టెస్టు జరుగగా.. ఆతిథ్య ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.
అయితే, ఎడ్జ్బాస్టన్లో భారత్ ఇందుకు ప్రతీకారం తీర్చుకుంది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. ఈ వేదికపై తొలి గెలుపు నమోదు చేసింది.
ఇక ఇరుజట్ల మధ్య లార్డ్స్లో ఇప్పటి వరకు 19 టెస్టులు జరుగగా ఇంగ్లండ్ 12, భారత్ మూడు టెస్టు గెలువగా.. నాలుగు డ్రా అయ్యాయి. కాగా 2021లో చివరగా ఇక్కడ టీమిండియా గెలుపుబావుటా ఎగురవేసింది.
తుదిజట్లు
భారత్
శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.
ఇంగ్లండ్
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.