
సాక్షి, హైదరాబాద్: భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పురుషుల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ కొత్త ప్రయాణం ఆరంభించాడు. హైదరాబాద్ పికిల్బాల్ లీగ్ (HPL)లో అధికారిక పెట్టుబడిదారుడిగా, భాగస్వామిగా నంది ఛార్జర్స్ ఫ్రాంచైజీలో చేరారు. శ్రీకాంత్ రాకతో ఈ లీగ్కు అత్యున్నత స్థాయి క్రీడా ప్రమాణాలను తీసుకువస్తుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో హైదరాబాద్లో ప్రారంభం కానున్న పికిల్బాల్ క్రీడకు ఇది మరింత ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు.
కాగా శ్రీకాంత్ తన కెరీర్లో 12కి పైగా అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్లో దేశ స్థాయిని పెంచడంలో తన వంతుగా కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు నంది ఛార్జర్స్ జట్టుతో కలసి ఛాంపియన్ల ఆలోచనను, పోటీ స్ఫూర్తిని పికిల్బాల్లోకి తీసుకురానున్నాడు.
సంతోషంగా ఉంది
"హైదరాబాద్ పికిల్బాల్ లీగ్లో భాగం కావడం, నంది ఛార్జర్స్తో చేతులు కలపడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. పికిల్బాల్ చాలా వేగంగా, డైనమిక్గా ఉంటుంది. భారతదేశంలోని అభిమానులతో కనెక్ట్ అవడానికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. చూడటానికి థ్రిల్లింగ్గా, అత్యంత పోటీతత్వంతో ఉంటుంది.
నా క్రీడా అనుభవాన్ని ఒక కొత్త రంగంలోకి తీసుకువచ్చి.. ఈ లీగ్ ప్రాముఖ్యతను పెంచడానికి సహాయపడటం నన్ను ఎంతో ఉత్తేజపరిచే విషయం. ఈ ప్రయాణం ప్రారంభంలోనే భాగం కావడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. నంది ఛార్జర్స్ జట్టు ఉత్సాహంగా ఆడుతూ అందరికీ స్ఫూర్తినిస్తుందని నేను నమ్ముతున్నా" అని కిదాంబి శ్రీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
మా ప్రధాన లక్ష్యం అదే
నంది ఛార్జర్స్ ఫ్రాంచైజీ యజమాని అనిరుధ్ పొన్నాల మాట్లాడుతూ, "శ్రీకాంత్ను నంది ఛార్జర్స్ కుటుంబంలోకి స్వాగతించడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశపు గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరిగా ఆయన స్థాయి మా జట్టుకు అపారమైన విశ్వసనీయతను, శక్తిని తీసుకువస్తుంది.
అద్భుతమైన నైపుణ్యం, పోటీతత్వం, గెలుపు స్ఫూర్తిని చూపిస్తూ మా జట్టును ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ప్రధాన లక్ష్యం" అని తెలిపారు. కాగా హైదరాబాద్ పికిల్బాల్ లీగ్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు ఉంటాయి. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం రాత్రి మ్యాచ్లు జరుగుతాయి.