History Of Ashes Test Series In Telugu, ENG Vs Australia Rivalry Ahead Of Ashes 2023 - Sakshi
Sakshi News home page

Ashes History In Telugu: 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్‌' పదం ఎలా వచ్చిందంటే?

Jun 15 2023 9:25 AM | Updated on Jun 15 2023 10:23 AM

History-Of-Ashes Test Series ENG Vs Australia Rivalry-Over-The-Years - Sakshi

క్రికెట్‌ చరిత్రలో భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికి తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే రెండు దేశాల్లోని క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలవుతుంటాయి. అచ్చం అలాంటి పోరు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య కూడా ఉంటుంది. అది కూడా సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో. టి20 క్రికెట్‌ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా కూడా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్‌ టెస్టు సిరీస్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు.

దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ను ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కేవలం ఒక ట్రోపీలో ఉన్న బూడిద కోసం కొదమసింహాల్లా తలపడే రెండు జట్ల పోరు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రెండేళ్లకు ఒకసారి జరిగే యాషెస్‌ సిరీస్‌ మళ్లీ వచ్చేసింది. జూన్‌ 16 నుంచి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ జరగనుంది. యాషెస్‌ సిరీస్‌కు ఈసారి ఇంగ్లండ్‌ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో అసలు యాషెస్‌ అనే పేరు ఎలా వచ్చింది.. ఈ సిరీస్‌ ఎందుకు ఇరుదేశాలకు ప్రతిష్టాత్మకం అనేది మరోసారి తెలుసుకుందాం.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

1882లో మొదలైన గొడవ..
1882లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా తొలిసారి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాయి. ఆ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అప్పటివరకు 22 టెస్టుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో ఫెవరెట్‌గా కనిపించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది. ఆ సిరీస్‌లో ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్ కాబ‌ట్టి.. అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు వంద‌ల్లో వెలువ‌డ్డాయి

ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ అనే ప‌త్రిక‌ ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. 

ఆ తర్వాత కొన్ని వారాలకే హాన్ ఐవో బ్లిగ్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా బ్లిగ్ మాట్లాడుతూ... యాషెస్‌ను తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. స్థానిక మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ మ‌ళ్లీ వంద‌ల సంఖ్య‌లో వార్తలు ప్రచురించాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ విల్ మర్దోక్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. యాషెస్‌ను ఇంగ్లండ్‌ పట్టుకెళ్లకుండా అడ్డుకుంటామని పేర్కొన్నాడు. 

కలశంలో బూడిద..
అయితే ఇంగ్లండ్‌ ఓటమిని దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు రాసిన వార్తా పత్రికలను ఒక మహిళా బృందం తగలబెట్టింది. దానికి సంబంధించిన బూడిదను కలశం లాంటి పాత్రలో పెట్టి  అప్పటి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బ్లైగ్‌కు అందించారు. కాగా ఆ కలశంలో నిజమైన యాషెస్ ఇప్పటికీ ఉపయోగించిన ఒక జత స్టంప్ బెయిల్‌ల్‌ను లండన్‌ మ్యూజియంలో భద్రపరిచారు.  అప్పటినుంచి  కాగా పెళుసుగా ఉండే అసలైన దానిని లార్డ్స్‌లోని క్రికెట్ మ్యూజియంలో చూడొచ్చు.

అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్‌ అని పేరు పెట్టారు. కాగా సిరీస్‌ గెలుపొందిన జట్లకు కలశం ప్రతిరూపాన్ని అందజేస్తారు.ఆ తర్వాత ఈ సిరీస్ కోసం కలశం రూపంలోనే ప్ర‌త్యేక ట్రోఫీని త‌యారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్‌ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

మొదట్లో ఇంగ్లండ్‌.. ఇప్పుడు ఆసీస్‌దే ఆధిపత్యం
ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య 72 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే.. అందులో ఆస్ట్రేలియా 3 సార్లు, ఇంగ్లండ్‌ 32 సార్లు విజయాలు అందుకోగా.. ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. ఇక 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ సిరీస్‌లో 356 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 150.. ఇంగ్లండ్‌ 110 మ్యాచ్‌లు నెగ్గగా.. 96 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఇక ప్రస్తుతం యాషెస్‌ ట్రోపీ ఆస్ట్రేలియా వద్ద ఉంది. 2021-22లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్‌ 2015 తర్వాత మళ్లీ యాషెస్‌ను గెలవలేకపోయింది. ఈసారి స్టోక్స్‌ నేతృత్వంలో బజ్‌బాల్‌ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ ఎలాగైనా యాషెస్‌ ట్రోపీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు ఇటీవలే టీమిండియాను ఓడించి ప్రపంచటెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా 73వ సారి జరుగుతున్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జూన్‌ 16 నుంచి 20 వరకు జరగనుంది.

చదవండి: ఎల్‌పీఎల్‌ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?

#TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement