'అలీ బాయ్‌.. అజిత్‌ సినిమా అప్‌డేట్‌ ఏంటి!'

Hillarious Video Fans Ask Moeen Ali Updates On Ajith Upcoming Movie - Sakshi

చెన్నై: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీతో ఫ్యాన్స్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాట సినిమాలను విపరీతంగా అభిమానిస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ హీరోల కోసం అభిమానులు ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తమిళనాట సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న అజిత్‌ తాజాగా 'వాలిమయి' అనే సినిమాలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం తమిళనాట ఈ చిత్రంపై చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ అభిమానుల మధ్య ఈ సినిమాకు సంబంధించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ అలీతో మ్యాచ్‌ చూడడానికి వచ్చిన  ఫ్యాన్స్‌ అజిత్‌ సినిమా అప్‌డేట్‌ గురించి అడిగారు. బౌండరీ లైన్‌ వద్ద నిలబడి ఉన్న మొయిన్‌ అలీతో.. 'అలీ బాయ్‌..  వాలిమయి అప్‌డేట్‌ ఏంటి 'అని అడిగారు. వారి భాష అర్థంకాని మొయిన్‌ అలీ నవ్వుతూ వారికి చేతులూపాడు. అలీ సంభాషణను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది.

కాగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించాడు. తొలిరోజు కోహ్లిని అలీ అవుట్‌ చేసిన తీరు హైలెట్‌గా నిలిచింది. అంతేగాక తొలిరోజు ఆటలో మూడు వికెట్లు తీసి స్పిన్‌ సత్తా చాటాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు వద్ద తొలిరోజు ఆటను ముగించిన టీమిండియా రెండోరోజు మరో 29 పరుగులు మాత్రమే జోడించి 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌ బ్యాటింగ్‌లో రోహిత్‌ 161 పరుగులు, రహానే 66 పరుగులు, రిషబ్‌ పంత్‌ 58 నాటౌట్‌ రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ 4 వికెట్లతో రాణించగా, ఓలీ స్టోన్‌ 3, జాక్‌ లీచ్‌ 2 వికెట్లు తీయగా.. కెప్టెన్‌ రూట్‌ ఒక వికెట్‌ తీశాడు.
చదవండి: మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top