England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ | Harshit Rana Released From England Tour, BCCI Asks KKR Pacer To Fly Back To India Says Report | Sakshi
Sakshi News home page

England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ

Jun 25 2025 8:01 PM | Updated on Jun 25 2025 8:23 PM

Harshit Rana Released From England Tour, BCCI Asks KKR Pacer To Fly Back To India Says Report

ఇంగ్లండ్‌ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్‌ పేసర్‌గా ఎంపికైన హర్షిత్‌ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్‌ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్‌మెంట్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు హర్షిత్‌ను రిలీజ్‌ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్‌ కోసం బర్మింగ్హమ్‌కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్‌ లేడని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 

వాస్తవానికి హర్షిత్‌ ఇంగ్లండ్‌ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్‌ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్‌ కోచ్‌ గంభీర్‌ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్‌ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్‌ ప్రారంభానికి ముందు హర్షిత్‌ హుటాహుటిన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. 

అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్‌ పేసర్‌ అవసరం లేదని భారత మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్‌గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్‌మెంట్‌ హర్షిత్‌ను బీసీసీఐకి సరెండర్‌ చేసినట్లు తెలుస్తుంది.

గంభీర్‌పై విమర్శలు
ఇంగ్లండ్‌ పర్యటన కోసం​ హర్షిత్‌ను టీమిండియా బ్యాకప్‌ పేసర్‌ ఎంపిక​ చేసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై విమర్శలు వచ్చాయి. హర్షిత్‌ విషయంలో గంభీర్‌  పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్‌ కేకేఆర్‌ కోచ్‌గా ఉన్నప్పుడు హర్షిత్‌ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యాక హర్షిత్‌ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్‌ వినిపించింది. 

గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యాకే హర్షిత్‌ మూడు ఫార్మాట్లలో భారత్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్‌లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు హర్షిత్‌ను బ్యాకప్‌ పేసర్‌గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్‌ను బీసీసీఐ సరెండర్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, బ్యాకప్‌ పేసర్‌తో పాటు పేస్‌ బౌలింగ్‌ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్‌ తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి బౌలింగ్‌ విభాగం కూడా ఒకానొక కారణం. 

తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్‌ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌కు పగ్గాలేయడం​ ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్‌ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement