గౌస్‌–పూజ జోడీకి స్వర్ణం  | Gold for the Gauss and Pooja pair | Sakshi
Sakshi News home page

గౌస్‌–పూజ జోడీకి స్వర్ణం 

Oct 25 2023 2:06 AM | Updated on Oct 25 2023 2:06 AM

Gold for the Gauss and Pooja pair - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణ పతకం లభించింది. గోవాలో జరుగుతున్న ఈ క్రీడల్లో మంగళవారం ముగిసిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో షేక్‌ గౌస్‌–పూజ (ఆంధ్రప్రదేశ్‌) జోడీ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో షేక్‌ గౌస్‌–పూజ ద్వయం 21–8, 21–17తో బొక్కా నవనీత్‌–కె.మనీషా (తెలంగాణ) జంటను ఓడించింది. ఫైనల్లో ఓడిన నవనీత్‌–మనీషా జోడీకి రజతం దక్కింది.  

తరుణ్‌కు పసిడి పతకం 
సింగిల్స్‌ విభాగంలో తెలంగాణకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌ విభాగంలో మన్నేపల్లి తరుణ్‌ స్వర్ణ పతకాన్ని, మహిళల సింగిల్స్‌లో మారెడ్డి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. ఫైనల్లో తరుణ్‌ 21–15, 16–21, 21–15తో సౌరభ్‌ వర్మ (మధ్యప్రదేశ్‌)పై నెగ్గగా... సెమీఫైనల్లో మేఘన రెడ్డి 21–7, 22–24, 16–21తో అదితి భట్‌ (ఉత్తరాఖండ్‌) చేతిలో ఓడిపోయింది.

సౌరభ్‌ వర్మతో 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నిర్ణాయక చివరి గేమ్‌లో తరుణ్‌ స్కోరు 15–15 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో తరుణ్‌ 12–21, 21–14, 22–20తో జాతీయ చాంపియన్‌ మిథున్‌ (కర్ణాటక)ను ఓడించడం విశేషం.   

Advertisement
 
Advertisement
Advertisement