
బనశంకరి: భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కనకశ్రీ లేఔట్ ఎస్ఎల్వీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడటంతో తీవ్ర గాయాలై మరణించారు. గురువారం ఉదయం గం. 11:15 సమయంలో ఈ సంఘటన జరిగింది.
హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి.
1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్లో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో జాన్సన్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు సాధించాడు.