
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (మే 30) జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు ట్యామీ బేమౌంట్, యామీ జోన్స్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది.
బేమౌంట్ 107 (104 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), యామీ జోన్స్ 122 పరుగులు (121 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) చేసి ఔటయ్యారు. 41 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 262/3గా ఉంది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (8), సోఫియా డంక్లీ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది.
కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.