
బుమ్రాకు సహచరుల అభినందన
రసకందాయంలో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు
96 పరుగుల ఆధిక్యంలో భారత్
రెండో ఇన్నింగ్స్లో 90/2
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 ఆలౌట్
బ్రూక్ 99 అవుట్
బుమ్రాకు 5 వికెట్లు
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది!
లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్గా 96 పరుగుల ముందంజలో ఉంది.
రాహుల్తో పాటు కెపె్టన్ శుబ్మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు.
జైస్వాల్ 4 పరుగులకే...
తొలి ఇన్నింగ్స్లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్లో మూడు క్యాచ్లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్తో కలిసి రెండో వికెట్కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
బ్రూక్... పరుగు తేడాతో
బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు.
తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.
అదే తంతు..
ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.
దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్కు సాయపడ్డాడు.
టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.
వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.
బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.
వికెట్ల పతనం: 1–16, 2–82.
బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1.