చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న టీమిండియా | ENG VS IND 5th Test: India Loses 15th Consecutive Toss, Extends World Record | Sakshi
Sakshi News home page

ENG VS IND 5th Test: చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న టీమిండియా

Jul 31 2025 4:12 PM | Updated on Jul 31 2025 4:55 PM

ENG VS IND 5th Test: India Loses 15th Consecutive Toss, Extends World Record

టాస్‌ విషయంలో టీమిండియా ఇప్పటికే తమ ఖాతాలో ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. వరుసగా 14 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడి.. వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన జట్టుగా చలామణి అవుతున్న భారత్‌.. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లోనూ టాస్‌ ఓడి తమ వరుస టాస్‌ ఓటముల సంఖ్యను 15కు పెంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టు ఇప్పటివరకు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడలేదు.

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ కలుపుకొని భారత్‌ వరుసగా ఐదు టెస్ట్‌లు, అంతకుముందు 8 వన్డేలు, 2 టీ20ల్లో టాస్‌ కోల్పోయింది. భారత్‌ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో (రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌) టాస్‌ గెలిచింది.

టాస్‌ విషయంలో భారత్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే భారత కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన గిల్‌.. ఈ సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడాడు. తద్వారా కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌లోనే ఐదు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన కెప్టెన్‌గా నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడటం ఇది 14వ సారి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదనంలో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ స్థానాల్లో ధ్రువ్‌ జురెల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి వచ్చారు.

ఈ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్‌ ఠాకూర్‌ను పక్కకు పెట్టి మరీ కరుణ్‌కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్‌కు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ కావచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే కరుణ్‌ కెరీర్‌ సమాప్తమైనట్లే.

మరోవైపు ఇంగ్లండ్‌ సైతం ఈ మ్యాచ్‌ కోసం​ నాలుగు మార్పులు చేసింది. స్టోక్స్, ‌జోఫ్రా ఆర్చర్‌, బ్రైడన్‌ కార్స్‌, లియామ్‌ డాసన్‌ స్థానాల్లో జేకబ్‌ బేతెల్‌, గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌, జేమీ ఓవర్టన్‌ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస​్‌ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉంది.

తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్

 

Advertisement
 
Advertisement
Advertisement