CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! | CA Breaks Silence Update On Cricketers Unwilling To Return To India IPL | Sakshi
Sakshi News home page

CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!

May 13 2025 9:56 AM | Updated on May 13 2025 10:16 AM

CA Breaks Silence Update On Cricketers Unwilling To Return To India IPL

PC: BCCI

ఐపీఎల్-2025‌ (IPL 2025) వాయిదా పడటంతో స్వదేశం చేరిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు అండగా నిలుస్తోంది. ఇష్టమైతేనే లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వెళ్లాలని.. లేదంటే ఇక్కడే ఉండిపోవచ్చని క్రికెట్‌ ఆస్ట్రేలియా ( CA) సూచించిందని ఆ దేశ మీడియా కథనం వెలువరించింది.

కాగా భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లంతా లీగ్‌ వాయిదా పడగానే స్వదేశానికి వెళ్లిపోయారు.

వారు మాత్రం ఇక్కడే
కోచింగ్‌ స్టాఫ్‌లో ఉన్న రికీ పాంటింగ్, బ్రాడ్‌ హాడిన్‌ తదితరులు మాత్రం భారత్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఈనెల 17 నుంచి తిరిగి ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ క్రికెటర్లకు పిలిపించుకొని సిద్ధంగా ఉండాలని బోర్డు ఇదివరకే ఫ్రాంచైజీలకు తెలిపింది.

అయితే ఆటగాళ్లంతా ఐపీఎల్‌ కోసం వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఏ వారికి అండగా నిలవాలనుకుంటుందని ‘సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌’ పత్రిక తమ కథనంలో పేర్కొంది. దాయాది దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులతో తమ ఆటగాళ్లంతా భయాందోళనకు గురయ్యారని అలాంటపుడు మళ్లీ ఐపీఎల్‌ కోసం వెళ్లమని క్రికెట్‌ ఆస్ట్రేలియా చెప్పబోదని ఆ కథనంలో రాసింది.

ఫైనల్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే?
నిజానికి తమ ఆటగాళ్లకు మే 25తో ముగిసే ఐపీఎల్‌ షెడ్యూల్‌ వరకే ఆడేందుకు సీఏ అనుమతిచ్చింది. ఇప్పుడు గనక వారు మళ్లీ వెళ్లాలంటే సీఏ నుంచి మరోసారి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని ఆ పత్రిక వెల్లడించింది. పైకి భయం అంటూ కారణాలు చెబుతున్నా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2025 ఫైనల్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే ఆసీస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఫ్రాంఛైజీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.

ఐపీఎల్‌-2025లో వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు
👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ప్యాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌, ఆడం జంపా (గాయం కారణంగా ఇప్పటికే దూరం)
👉రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: జోష్‌ హాజిల్‌వుడ్‌, టిమ్‌ డేవిడ్‌
👉పంజాబ్‌ కింగ్స్‌: మార్కస్‌ స్టొయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (రూల్డ్‌ అవుట్‌), మిచ్‌ ఓవెన్‌ (ఇంకా జట్టుతో చేరలేదు), జోష్‌ ఇంగ్లిస్‌, ఆరోన్‌ హార్డీ, జేవియర్‌ బార్ట్‌లెట్‌
👉లక్నో సూపర్‌ జెయింట్స్‌: మిచెల్‌ మార్ష్‌
👉కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: స్పెన్సర్‌ జాన్సన్‌
👉ఢిల్లీ క్యాపిటల్స్‌: మిచెల్‌ స్టార్క్‌, జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌
👉చెన్నై సూపర్‌ కింగ్స్‌: నాథన్‌ ఎల్లిస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement