
క్రికెటర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఘజియాబాద్: పేస్ బౌలర్ యశ్ దయాళ్పై ఒక అమ్మాయి తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె పేర్కొంది. తాను, యశ్ గత ఐదేళ్లుగా కలిసి ఉన్నామని, తనతో అన్ని రకాలుగా అతను సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల అనే ఆ అమ్మాయి వెల్లడించింది. అయితే ఇప్పుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తప్పించుకుంటున్నాడని వెల్లడించింది. మరో వైపు ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు పెట్టుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా ద్వారా తన పేరుతో సహా ఈ విషయాలన్నింటినీ బహిరంగపర్చిన ఆ అమ్మాయి అధికారికంగా కూడా ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. గతంలో కూడా మహిళల హెల్ప్లైన్ ద్వారా తన సమస్య చెప్పేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన రాలేదన్న ఆమె...ఇప్పుడైనా జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని నేరుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేసింది.
దీనిపై ఇంకా దయాళ్ స్పందించలేదు. ప్రయాగ్రాజ్కు చెందిన 27 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ దయాళ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, బెంగళూర రాయల్స్ చాలెంజర్స్ జట్ల తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.