రన్నరప్‌గా బోపన్న జోడి | Bopanna Jodi as runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా బోపన్న జోడి

Jan 14 2024 3:31 AM | Updated on Jan 14 2024 3:31 AM

Bopanna Jodi as runner-up - Sakshi

కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనుకున్న భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశే ఎదురైంది. అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ ఏటీపీ –250 టోర్నీలో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో  మూడో సీడ్‌ రాజీవ్‌ రామ్‌ (అమెరికా) – జో సాలిస్‌బరీ ద్వయం 7–5, 5–7, 11–9తో రెండో సీడ్‌ బోపన్న – ఎబ్డెన్‌పై విజయం సాధించింది.

బోపన్న జంట 12 ఏస్‌లు సంధించినా లాభం లేకపోయింది. తొలి సెట్‌లో ఒక దశలో 4–0తో ఆధిక్యంలో ఉండి కూడా బోపన్న టీమ్‌ దానిని చేజార్చుకుంది. రెండో సెట్‌లో స్కోరు 5–5తో సమంగా ఉన్న సమయంలో ప్రత్యర్థి గేమ్‌ను బ్రేక్‌ చేసి ముందంజ వేసిన రోహన్‌ – ఎబ్డెన్‌ ఆ తర్వాత సెట్‌ను గెలుచుకున్నారు.

మూడో సెట్‌ టైబ్రేకర్‌తో చివరకు రాజీవ్‌ – సాలిస్‌బరీదే పైచేయి అయింది. ఒక గంటా 38 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో  5 డబుల్‌ ఫాల్ట్‌లు చేసి కూడా ఈ జంట గట్టెక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement