భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్లో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది. అయితే మరోసారి ఈ పరిమిత ఓవర్ల సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
"బంగ్లాదేశ్ టూర్ను మేము ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్ను విడుదల చేసినప్పటికి.. టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఈ టూర్పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నాము.
ఎందుకంటే దేశం వెళ్లి ఆడాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసారి. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే.. బంగ్లాదేశ్ మ్యాచ్లు భారత్లో జరగనున్నాయి" అని సదరు అధికారి పేర్కొన్నారు.
కాగా భారత్-బంగ్లా జట్టు వైట్బాల్ సిరీస్ షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ అంతలోనే బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. వాస్తవానికి గతేడాది ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల అది ఈ ఏడాది సెప్టెంబర్కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అదే కథ పునరావృతమయ్యేలా ఉంది. పొట్టి ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు ఫిబ్రవరిలో రానుంది.
ముస్తాఫిజుర్ ఔట్..
అదేవిధంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్కతా నైట్ రైడర్స్ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్లో ఆడకుండా చాలా మంది డిమాండ్ చేశారు.
అయితే కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ముస్తాఫిజుర్ను జట్టు విడుదల చేయాలని కేకేఆర్ను సూచించింది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు


