T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’ | Bangladesh In trap Naqvi may misled them into T20 WC boycott: Ex BCB official | Sakshi
Sakshi News home page

T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Feb 20 2026 12:19 PM | Updated on Feb 20 2026 12:46 PM

Bangladesh In trap Naqvi may misled them into T20 WC boycott: Ex BCB official

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్వహించే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడటం ప్రతీ క్రికెటర్‌ చిరకాల స్వప్నం. ఒక్కసారి వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడినా తమ కెరీర్‌ పరిపూర్ణమైందని భావించే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. అయితే, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మొండిపట్టు కారణంగా ఆ దేశ క్రికెటర్లు ఈసారి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి దూరమయ్యారు.

ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ అని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) మాజీ అధికారి సయ్యద్‌ అష్రాఫుల్‌ హక్‌ (Syed Ashraful Haque) ఆరోపించారు. 

వరల్డ్‌కప్‌ నుంచి అవుట్‌
కాగా బంగ్లాదేశ్‌ గత కొంతకాలంగా భారత్‌తో కయ్యానికి కాలుదువుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగగా.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు.

ఈ నేపథ్యంలో భారత్‌లో తమకు భద్రత లేదని.. వరల్డ్‌కప్‌ టోర్నీ ఆడేందుకు అక్కడకు వెళ్లమని బంగ్లాదేశ్‌ బోర్డు ఐసీసీకి తెలిపింది. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరగా..  ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు ముప్పులేదని హామీ ఇచ్చింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోడంతో టోర్నీ నుంచి తప్పించింది.

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని చెప్పిన పీసీబీ.. ఐసీసీ జోక్యంతో యూటర్న్‌ తీసుకుంది. వరల్డ్‌కప్‌లో దాయాదితో ఆడి.. మరోసారి ఓడిపోయింది. 

ఈ పరిణామాలపై ఆసియా క్రికెట్‌ మండలి (ACC) మాజీ సీఈవో, బీసీబీ మాజీ జనరల్‌ సెక్రటరీ సయ్యద్‌ అష్రాఫుల్‌ హక్‌ స్పందించారు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతున్న క్రమంలో ‘బంగ్లాదేశ్‌ నిర్ణయం వెనుక పాకిస్తాన్‌ ఉందా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ..

నక్వీ రెచ్చగొట్టగానే..
‘‘ఇందుకు అవకాశం ఉంది. అయితే, నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదు. ఒ​క క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నేను ఎల్లప్పుడు ఆట పట్ల నిబద్ధత కలిగి ఉంటాను. అయితే, మా చీఫ్‌ అమినుల్‌ ఇస్లాంకు అనుభవం, ఆలోచన లేకుండా పోయాయి.

అందుకే ఏసీసీ ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్‌ నక్వీ మాటలు ఆయనపై ప్రభావం చూపాయి. నక్వీ రెచ్చగొట్టగానే ఇస్లాం అందుకు తగినట్లు స్పందించారు. ఆఖరికి ఎవరు గెలిచారు?

ఏదేమైనా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ తొందరపడ్డారు. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించినంత మాత్రాన ప్రపంచకప్‌ టోర్నీ నుంచి తప్పుకునేంత పెద్ద నిర్ణయం తీసుకోకూడదు.

బీసీసీఐతో ఆయన మాట్లాడాల్సింది. లేదంటే భారత ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించాల్సింది. ఐసీసీ నిర్వహించే టోర్నీకి భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఒకవేళ మనం కోరితే వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఈ విషయాలను అర్థం చేసుకోవడంతో నజ్రుల్‌ విఫలమయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియకుండా పోయింది. ఎవరో (నక్వీ) పన్నిన వ్యూహంలో ఆయన చిక్కుకున్నారు. జాతికి గొప్ప ఆస్తులైన క్రికెటర్లను కాపాడాల్సింది పోయి.. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనలో ఉండిపోయారు.

నష్టపోయాము
లిటన్‌ దాస్‌, ముస్తాఫిజుర్‌, నజ్ముల్‌ షాంటో మూడు పదుల వయసు దాటేశారు. సీనియర్లు ఇలా వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం పోగొట్టుకోవడం అన్యాయం. భారత్‌ తర్వాత బంగ్లాదేశ్‌లోనే క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. 

వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకోవాలనే నిర్ణయంతో అభిమానులను కూడా మోసం చేశారు’’ అని అష్రాఫుల్‌ పేర్కొన్నారు. నక్వీ రెచ్చగొట్టడం వల్లే నజ్రుల్‌ అలా వ్యవహరించారని.. ఫలితంగా తమ ఆటగాళ్లు, అభిమానులు నష్టపోయారని విమర్శించారు.

చదవండి: పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement