
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా-ఎ తరపున ఆడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశరిచాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్య స్ధానంలో ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చిన అభిషేక్ తన మార్క్ను చూపించలేకపోయాడు. అభిషేక్ తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జాక్ ఎడ్వర్డ్ తొలి బంతిని అభిషేక్కు వైడ్-ఆఫ్ డెలివరీగా సంధించాడు.
ఆ బంతిని ఈ పంజాబ్ ఆటగాడు కవర్స్పై నుంచి షాట్ ఆడాలని చూశాడు. కానీ బంతి మాత్రం అవుట్సైడ్-ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్లో ఉన్న సదర్లాండ్ చేతికి వెళ్లింది. దీంతో అభిషేక్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. టీ20ల్లో దుమ్ములేపుతున్న అభిషేక్కు వన్డేల్లో కూడా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచించారు. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సెలక్టర్ల దృష్టిలో అభిషేక్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో సెలక్టర్లు పునరాలోచనలో పడే అవకాశముంది. అయితే మూడో వన్డేలో అభిషేక్ తన బ్యాట్ను ఝూళిపిస్తే సెలక్షన్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఆసియాకప్-2025లో అభిషేక్ దుమ్ములేపాడు. 7 మ్యాచ్లలో 314 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.
తడబడుతున్న భారత్..
ఇక రెండో అనాధికారిక వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తడబడుతోంది. 60 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఇన్నింగ్స్ను రియాన్ పరాగ్, తిలక్ వర్మ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ రెండో వన్డేలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అయ్యర్ ఔటయ్యాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ సైతం(1) సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు.