ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది.
ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో అభిషేక్, శ్రేయస్లు కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ను దాటింది.


