తెలంగాణ రైస్ మిల్లు అసోసియేషన్ సమావేశం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సోదాలు నిలిపివేయాలని తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కన్వేన్షన్ హాల్లో శనివారం తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం కేటాయించకపోవడం దారుణమన్నారు. మూడు రోజులుగా కలెక్టర్, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులతోనే రైస్ మిల్లుల నిర్వహణ ముందుకు సాగుతుందని, రైతులు లేనిదే రైస్ మిల్లులు నిర్వహణ కష్టమన్నారు.
9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం
2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 9.70 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఇవ్వగా 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామన్నారు. కొందరు మిల్లర్లు చేసిన అవినీతికి అందరిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అవినీతి పరులను రైస్ మిల్ అసోసియేషన్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 75లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఇవ్వగా 51లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అందుకు గాను డిసెంబర్ 31 వరకు సమయం ఇవ్వాలన్నారు. రైస్ మిల్లర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగాలంటే చర్చలు నిర్వహిస్తే 75% సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.


