● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ● లోక్ అదాలత్లో దివ్యాంగులకు జాబ్ మేళా ● 30 మందికి ఉద్యోగాల కల్పన
సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో మొత్తం 7,613 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. దివ్యాంగులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాద కేసుల్లో రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాలు ముందుకు రావాలన్నారు. దివ్యాంగుజన్ కౌశల్ వికాస్, దివ్యాంగుజన్ రోజ్గార్ సేతు కార్యక్రమాలపై అవగహన కల్పించి దివ్యాంగుల సంక్షేమ శాఖ, చేయూత పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆర్సెటి ద్వారా శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులకు జాబ్ మేళా ద్వారా 175మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వీరిలో 30మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, లీడ్ బ్యాంక్ స్టాళ్లను న్యాయమూర్తులు పరిశీలించారు. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల్లో 36 సివిల్, 7,549 క్రిమినల్, మోటారు ప్రమాద 28కేసులున్నాయని తెలిపారు. మోటారు వాహన ప్రమాద కేసుల్లో రూ.1,34,05,000 ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తి జయప్రసా ద్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయ మూర్తి సౌజన్య, జిల్ల వెల్ఫేర్ ఆఫీసర్ శారద, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు రమేష్బాబు, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు వాసుదేవరావు, మహేందర్రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.


