● విద్యార్థుల్లో జాతీయభావం అవసరం
● ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేటజోన్: సమాజంలో గురువులకు ఒక అత్యున్నత గౌరవ స్థానం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం టీటీసీ భవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో జాతీయ భావం మరింత పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. వచ్చే తరానికి జనగణమన, వందేమాతరం గీతాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అవార్డులు, రివార్డులు ముఖ్యం కాదని, మీకు విద్యార్థులు ఇచ్చే గౌరవం పెద్ద పురస్కారమన్నారు. అవార్డులు అనేది మనిషికి ఉత్సహం, ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అవార్డులు రానివారు నిరాశ పడొద్దని సూచించారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవమని కొన్ని కారణాల వల్ల టీచర్ కాలేక పోయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారికి నాణ్యమైన బోధన చేయాలన్నారు. ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులను చూసి పిల్లలు నేర్చుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఆచరించు.. బోధించు అనే నినాదంతో టీచర్లు ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాల్లో వారు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు బాధ్యత టీచర్ల మీద ఉందన్నారు.అనంతరం కలెక్టర్ హైమావతి. పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్లతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


