కలెక్టర్ హైమావతి
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నీటిని తాగునీటికి మాత్రమే వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. తపాస్పల్లి రిజర్వాయర్ను శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 0.3 టీఎంసీలు ఉండగా దేవాదుల వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని బట్టి 0.2 టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్లో నిల్వ చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కుడి, ఎడమ కాలువలోకి నీటి వదల్లేదని నీటి పారుదల శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ...ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల రిజర్వాయర్ నీటిని వ్యవసాయ రంగానికి కాకుండా వేసవిలో తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని రైతులకు తెలిపారు. రిజర్వాయర్ నుంచి గౌరయపల్లి మీదుగా చేర్యాల మండలం కమలాయపల్లి వరకు కాలువను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ దివ్య, ఎస్ఐ మహేశ్, నీటిపారుదల శాఖ అధికారులున్నారు.
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్ కార్యాలయం పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవీఎం) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా త్రైమాసిక పరిశీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్ లను, భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్ లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ ప్రకారం అన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు.


