బెజ్జంకి(సిద్దిపేట): బీఆర్ఎస్, కాంగ్రెస్ల నిరసన కార్యక్రమాలతో ఆదివారం బెజ్జంకిలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో ధ్వంసమైన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బెజ్జంకి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా రూ.23 కోట్ల వేతనం తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగించారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ తిరుపతి అడ్డుకుని భగ్నం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ ప్రశాంతంగా సాగింది.
రోడ్ల కోసం బీఆర్ఎస్ నిరసన


