సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సునీత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ హానర్ (1), ఎకానామిక్స్ (1), ఫైనాన్స్ (1), తెలుగు (1) ఆధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 27న ఉదయం 10.30గంటల నుంచి కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల కోసం..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జాతీయ ఉపాధ్యా య దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఆదర్శ, కేజీబీవీ, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఈ నెల 29లోగా దరఖాస్తులను స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో అందించాలన్నారు.
సవరణలు చేపట్టాలి
దుబ్బాక: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులతో కలిసి సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్మక్వానను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989లో కీలక సవరణలు చేయా లని కోరారు. దీంతో కిషోర్మక్వాన సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చినట్లు వెంకటయ్య తెలిపారు.
అణగారిన వర్గాల
గొంతుకవుతాం
ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చేబర్తి యాదగిరి
గజ్వేల్: అణగారిన వర్గాల పక్షాన భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో భాగస్వాములమవుతామని మాదిగ ఉద్యోగుల సమాఖ్య(ఎంఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చేబర్తి యాదగిరి అన్నారు. ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై న సందర్భంగా సోమవారం గజ్వేల్లో విలేకరులతో మాట్లాడారు. గౌతమబుద్ధుడు, పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్, జగ్జీవన్రామ్ లాంటి మహనీయుల ఆకాంక్షించిన నవ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ, ఉద్యోగులు పీఆర్సీ, డీఏ, సీపీఎస్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామన్నారు.
జక్కనపల్లి రాముకు
జాతీయ పురస్కారం
చేర్యాల(సిద్దిపేట): పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాముకు మరో అరుదైన జాతీయ అవార్డు వరించింది. సోమవారం తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పురస్కారాలను ట్రస్టు వ్యవస్థాపకుడు గౌరిశంకర్ ప్రదానం చేశారు. సుద్దముక్కలపై తెలుగు భాష వర్ణమాల చేయడంతో జక్కనపల్లి రాముకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కలిపించి, సన్మానం, ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సాహితి సామ్రాట్ సూరేంపల్లి విజయ, పొదిల విశ్వనాథ శాస్త్రి, మహిళ కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ వ్యవస్థ నిర్వీర్యం
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అభిషేక్
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఓ 97 ద్వారా పాలిటెక్నిక్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను పెంచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు.


