తొగుట(దుబ్బాక): మల్లన్న సాగర్ రిజర్వాయర్లో అధికారులు బుధవారం డ్రై రన్ నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి పంప్ హౌస్ నుంచి రిజర్వాయర్లోకి మోటార్లను రన్ చేసి నీటిని వదులుతారు. ఇలా అన్ని మోటార్లను అధికారులు పరిశీలిస్తారు. అందులో భాగంగానే ఒకటవ నంబర్ మోటార్ ద్వారా పంపింగ్ ప్రక్రియను అధికారులు పరిశీలించారు. వర్షాలు కురిసి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో మల్లన్న సాగర్లో గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రిజర్వాయర్లో 13.83టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పరిధిలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దంటూ పలువురు బాధితులు కోరారు. పట్టణంలోని అంగడి బజారు నుంచి ఆకునూరు వెళ్లే రోడ్డును విస్తరిస్తుండటంతో కూల్చి వేతకు గురయ్యే ఇళ్ల యజమానులు బుధవారం రోడ్డుపై నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను కూల్చడం తగదన్నారు. వెంటనే విస్తరణ పనులు నిలిపివేసి, బైపాస్ రోడ్డును వినియోగంలోకి తేవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
పిల్లలందరికీ
టీకాలు వేయించాలి
జిల్లా వైద్యాధికారి ధనరాజ్
కొండపాక(గజ్వేల్): అర్హులైన పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయించేలా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధనరాజ్ వైద్యులకు సూచించారు. కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దుద్దెడ సబ్ సెంటర్ను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అలాగే వ్యాధి నిరోధన టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ధనరాజ్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలు విధులు సమర్థంగా నిర్వహించేలా వైద్యులు చూసుకోవాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమయ్యే మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వైద్యులు శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రసాయన ఉత్పత్తులపై వర్క్షాప్
సిద్దిపేటఎడ్యుకేషన్: గృహ వినియోగ రసాయన ఉత్పత్తుల తయారీ నైపుణ్యాల అభివృద్ధిపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు. రిసోర్స్ పర్సన్ జయంతి గృహ రసాయన ఉత్పత్తుల తయారీ విధానాలు, నాణ్యాతా ప్రమాణాలు, భద్రతాజాగ్రత్తలు, స్వయం ఉపాధి అవకాశాలపై కల్పించారు. వర్క్షాప్ కన్వీనర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని చెప్పారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ సేవాభారతి ట్రస్ట్, కెమిస్ట్రీ విభాగాల మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.


