● పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్ ● డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్నేరాలపై అవగాహన
సిద్దిపేటఎడ్యుకేషన్: సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకుని సైబర్ వారియర్లుగా మారి గ్రామీణులకు అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్ పిలుపునిచ్చారు. సైబర్ జాగృక్త దివస్ను పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడం మన చేతుల్లోనే ఉందన్నారు. ఆన్లైన్ పరిచయస్తుల డిజిటల్ అరెస్ట్లకు భయపడకూడదని, స్ట్రాంగ్ పాస్వర్డ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మనోధైర్యంతో ఉండి మానసిక ఒత్తిడిని జయించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్, మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే పోలీసులకు సమాచారం అందించి సహాయం తీసుకోవాలని కోరారు. అదనపు డీసీపీ (అడ్మిన్) కుషాల్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక పోవడం వల్ల రైతులు సైబర్ మోసాలకు గురవుతూ నష్టపోతున్నట్లు చెప్పారు. తెలుసుకున్న విషయాలను విద్యార్థులు రైతులకు, తమ తల్లిదండ్రులకు వివరించి సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ రాజు మాట్లాడుతూ సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేసే విధానాన్ని వివరించారు. అంతకు ముందు సురాక్ష కా తిరంగా పోస్టర్ను ఆవిష్కరించారు. ముస్తాబాద్ చౌరస్తా వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఆన్లైన్ క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్యరెడ్డితో పాటు ఎన్సీసీ కేర్టేకర్ కృష్ణయ్య, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ప్రోగ్రాం అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.


