డీఎంహెచ్ఓ ధనరాజ్
సిద్దిపేటకమాన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు పంపిణీ చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల వారు 2,12,569మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 2,461 పంపిణీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బంది మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నేడు మాత్రలు తీసుకోలేని పిల్లలకు ఈ నెల 20న నిర్వహించే మాప్ అప్ డే కార్యక్రమంలో భాగంగా మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సూచించారు.


